నేడు నెల్లూరు

Saturday, October 2, 2010

మేకపాటి బ్రదర్స్ కు షోకాజ్ నోటీసులు

కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు పెద్ద షాకే తగిలింది. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర ప్రారంభం కాక ముందే పట్టు బిగించేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న నాయకులకు ఎఐసిసి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కి పిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సమయంలోనే ఎఐసిసి మేకపాటి బ్రదర్స్ కు మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డికి, నాయకులు శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, తమకు షోకాజ్ నోటీసులు అందలేదని వారంటున్నారు. గతంలో డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కూడా తమకు నోటీసు అందలేదని చెప్పారు. ఆ తర్వాత అందినట్లు అంగీకరించారు. ప్రస్తుత షోకాజ్ నోటీసుల ప్రభావం జగన్ నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

No comments: