మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్థనరెడ్డిపై స్వయాన ఆయన సోదరుడు, ఎఐసిసి సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి శుక్రవారం యుపిఎ ఛైర్పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి నేదురుమల్లి జనార్థనరెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన సోనియాగాంధీకి చెప్పినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త, ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన పనబాక కృష్ణయ్యను ఓడించి తెలుగుదేశం పార్టీని జనార్థనరెడ్డి గెలిపించారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
పార్టీకి ద్రోహం చేస్తున్న నేదురుమల్లి జనార్థనరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవద్దని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలంటూ ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా తమ నాయకుడు నేదురుమల్లి జనార్థనరెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని రానీయకుండా చే సేందుకు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చేస్తున్న కుట్రలో ఇది భాగమని జిల్లాలోని నేదురుమల్లి అనుచరులు తెలిపారు. పనబాక లక్ష్మి ఎన్నివిధాలుగా కుట్రలు చేస్తున్నప్పటికీ యుపిఎ ఛైర్పర్సన్ సోనియాగాంధీ మాత్రం తమ పెద్దాయనకు అన్యాయం చేయరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను తప్పరని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల రాజస్థాన్ గవర్నర్ మృతి చెందడంతో నేదురుమల్లి జనార్థనరెడ్డిని రాజస్థాన్ గవర్నర్గా నియమిస్తున్నట్లు కూడా పనబాక లక్ష్మి వర్గీయులు పుకార్లు పుట్టిస్తున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
Saturday, May 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment