నేడు నెల్లూరు

Monday, May 16, 2011

ఆ మాజీ సి.ఎమ్. నేదురుమల్లి?


నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీఖాన్ కు గతంలో సంబందాలు పెట్టుకున్న రాజకీయ నేతలు గిజగిజలాడే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఇవేవి అవుతాయిలే అనుకున్నవారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఆంద్రప్రదేశ్ కు సంబందించిన మాజీ ముఖ్యమంత్రి ఒకరికి సంబంధాల ఉన్నట్లు ప్రచారం కావడంతో మొదట చంద్రబాబునాయుడు పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే దానిని ఆయన తీవ్రంగా ఖండించారు.పైగా హసన్ అలీకి వ్యతిరేకంగా ప్రకటనలు కూడా ఇచ్చారు. తాజాగా హసన్ అలీ సహ నిందితుడు కాశీనాద్ తపూరియా వెల్లడించిన వివరాల ప్రకారం మరో మాజీ ముఖ్యమంత్రిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయి.హసన్ అలీ మాజీ ఎమ్.పి సర్వారాయచౌదరిని తనకు పరిచయం చేశారని, ఆ తర్వాత మరో మాజీ ముఖ్యమంత్రిని కూడా పరిచయం చేశారని తపూరియా వల్లడించారు.చౌదరిని ముంబయిలోని ఆయన ఫ్లాట్లో కలిశానని, ఖాన్ కూడా అక్కడే ఉండేవారని, రెండువేల సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశానని అన్నారు. అయితే ఖాన్ కు, వారికి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయా?లేవా అన్న విషయం తనకు తెలియదని తపూరియా చెప్పారు.అయితే పరిశీలిస్తే 1999లో గెలిచిన వారిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఉన్నారు. ఆయన 1999లో నరసరావుపేట లో గెలుపొంది లోక్ సభ సభ్యునిగా ఉన్నారు. అంతేకాక ఎ.ఎస్.చౌదరికి, నేదురుమల్లికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.అందువల్ల తపూరియా నేదురుమల్లి పేరు చెప్పారా అన్నఅనుమానం వ్యక్తం అవుతోంది. అయితే నేదురుమల్లికి ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని తపూరియా చెప్పకపోవడం కొంతలో కొంత ఉపశమనంగా భావించాలి. కాగా సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సంబంధాలు ఉన్న ప్రముఖ బిల్డర్, సినీ నిర్మాత యూసఫ్ లక్డవాలా తో కూడా సంబంధాలు ఉన్న విషయాన్ని హసన్అలీ వెల్లడించారని తపూరియా తెలిపారు. తీగ లాగితే డొంక కదిలినట్లు హసనీ అలీ లింకులు ఎక్కడి నుంచి ఎక్కడకు వళుతున్నాయో!

జయలలితకు ఇష్టమైన నెంబర్‌




మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు బాగా అధికంగా ఉండే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి గా జయలలిత తన నమ్మకాలకు అనుగుణంగానే ప్రమాణస్వీకారం చేశారు.ఆమె తన స్టైల్‌లోనే మంత్రులతో కలిసి కూర్చున్నారు. అంత పెద్ద సీనియర్ మంత్రులు సైతం ఆమెకు కాస్త దూరంగా, చాలా వినయంగా కూర్చుని కన్పించారు. జయలలిత సీటుకు అటు ఇటూ కనీసం 2, 3 అడుగుల గ్యాప్ వరకు ఎవరూ కూర్చోలేదు.మాజీ ముఖ్యమంత్రి అయిన పన్నీర్‌సెల్వం జయలలితతో మాట్లాడటానికి లేచినపుడు ఆ సన్నివేశం చూస్తే వారికి జయలలిత పట్ల గౌరవమో, భయమో అర్థం కాని పరిస్థితిలో కన్పించారు. ఇక ఆమె నమ్మకాలను చూస్తే సరిగ్గా 12.15నిముషాలకు మద్రాస్ వర్శిటీలోని సెంటినరీ హాల్‌లోకి ప్రవేశించారు. ఎందుకంటే ఆమెకు 9 నెంబర్‌పై ఆపార నమ్మకం. 12.15అంకెలన్నీ కలిపితే తొమ్మిది అవుతుంది. అందుకే ఆ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.వంకాయరంగు చీర ధరించి వచ్చిన జయలలిత మొత్తం 33మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో 24మంది కొత్తవారు కావడం విశేషం. ఇక ఆమె ఇంటినెంబర్ కూడా 36కావడం (మూడుఆరు కలిపితే తొమ్మిది)మరో విశేషం.వీల్ చైర్‌లో వచ్చిన గవర్నర్ సూర్జిత్‌సింగ్ బర్నాలాను సాదరంగా జయలలిత ఆహ్వానించి తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. జాతీయగీతం తరువాత తమిళగీతం ఆలపించిన జయలలిత తమిళంలోనే ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఈమె విజయంలో మిక్సీలు,గ్రైండర్లతో పాటు కీలకపాత్ర పోషించాయని తమిళవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.